కిడ్ ఫ్రెండ్లీ న్యూస్‌పోర్టల్..

by Disha Web Desk 7 |
కిడ్ ఫ్రెండ్లీ న్యూస్‌పోర్టల్..
X

దిశ, ఫీచర్స్ : ఈ-తరం తల్లిదండ్రులు ఉద్యోగాలతో బిజీ అయిపోతుంటే.. మిగతా కుటుంబ సభ్యులు తమ తమ పనుల్లో తలమునకలవుతున్నారు. ఎవరికీ తీరిక దొరకని ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు మిగిలిన ఏకైక ఆప్షన్ 'సెల్‌ఫోన్' మాత్రమే. ఈ క్రమంలోనే డిజిటల్ డివైజెస్ వల్ల పిల్లలు చెడిపోతున్నారన్న వాదనలు వినిపిస్తుండగా.. స్మార్ట్‌గా వాడితే అంతకు మించిన లాభాలున్నాయని వివరిస్తున్నాడు చండీగఢ్‌ మాజీ కార్పొరేట్ లాయర్ అన్మోల్ మల్హోత్ర. ఈయన చిన్నారుల కోసమే ప్రత్యేక వార్తలందించే 'Newsahoot' వెబ్‌సైట్ ప్రారంభించాడు.

ఈ ఎడ్-టెక్ స్టార్టప్ సంక్లిష్టమైన వార్తాంశాలను ఆసక్తికరమైన, సానుకూల కథనాలుగా మార్చి పిల్లలకు అందిస్తుంది. సరైన కథనాల ద్వారా చిన్నారులను వాస్తవ ప్రపంచ వార్తలవైపు ఆకర్షించడం ద్వారా వారిని మరింత జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఇందులోని ఫీచర్స్ ఏమిటి? ఎలాంటి కథనాలు ఉంటాయి? ఏ వయసు పిల్లలకు ఉపయోగకరం? తదితర విశేషాలు తెలుసుకుందాం.

పిల్లలు తాము విన్న అంశాల గురించే ఎక్కువగా మాట్లాడతారు, చూసిన వాటినే అనుకరిస్తారు. ఈ విషయంలో వారిని సెల్‌ఫోన్ ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే కామిక్స్, కార్టూన్స్, వెబ్ సిరీస్‌, టీవీ షోస్ సహా సోషల్ మీడియా స్క్రోలింగ్, మీమ్స్‌తో ఈ తరం పిల్లలు తమ స్క్రీన్ స్పేస్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. రోజులో అధిక సమయం స్క్రీన్ ముందే గడిపినప్పటికీ తమను తాము ఏదైనా గ్లోబల్ లేదా ఎడ్యుకేషనల్ చానెల్ వైపు మళ్లించడంలో విఫలమవుతారు. అలాగని తమ చుట్టూ ఉన్న విషయాల గురించి ప్రశ్నించడం లేదని కాదు కానీ పిల్లల ఆలోచన ప్రక్రియకు సానుకూల దిశను నిర్ధారించే సరైన మెటీరియల్ లేకపోవడమే ఇక్కడ అసలు సమస్య. ఈ మేరకు పిల్లలకు సరళతతో వినూత్నమైన, విభిన్న రంగుల స్క్రీన్స్ అవసరముని గ్రహించిన అన్మోల్.. దేశంలోని పిల్లలకు 'Newsahoot‌'ను పరిచయం చేశాడు.

ఇందులో ఏం ఉంటాయి?

న్యూస్‌హూట్ అనేది ఎనిమిదేళ్లు పైబడిన పిల్లలకు నిజమైన వార్తలను అందించే ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్. ప్రపంచవ్యాప్త వ్యవహారాల గురించి చిన్న పిల్లలకు తెలియజేయడమే కాక వారి అభిజ్ఞా వికాసాన్ని, విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఇందులోని కథనాలుంటాయి. ఇది పిల్లలకు క్రమం తప్పకుండా వార్తలందిస్తూ భాషా నైపుణ్యాలను పెంపొందిస్తుంది. వార్తల్లోని క్లిష్టమైన అంశాలను సులభతరం చేస్తూ, మూడు స్థాయిల అభ్యాసకుల(బిగినర్స్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్‌డ్) కోసం రోజుకు ఒక కథనం చొప్పున వారానికి ఆరు కథనాలనే పోస్ట్ చేస్తుంది. ఈ మేరకు బిగినర్స్(3 నుంచి 4 తరగతుల పిల్లలు) కోసం సరళమైన భాషలో 250-350 పదాలకు మించని చిన్న వ్యాసాలుంటాయి. ఇంటర్మీడియట్ (5-6 తరగతులు) కేటగిరీలో 400 నుంచి 500 పదాల్లో వివరణాత్మక భావనలు గల చిన్న కథనాలుంటాయి. ఆపై అడ్వాన్స్‌డ్(7+ తరగతులు) పిల్లల కోసం అధునాతన భావనలు, పదాలతో కూడిన అత్యున్నత స్థాయి వార్తాంశ కథనాలుంటాయి.

పనితీరు మెరుగుపడే అవకాశం :

ప్రతివారం ఆరు విభిన్న కేటగిరీలకు సంబంధించిన వార్తా కథనాలు ఇందులో వస్తుంటాయి. పిల్లలు అనేక విషయాలపై జ్ఞానాన్ని పొందడంలో ఇదో ఉత్తమ మార్గం. ఈ వార్తల్లో ఎలాంటి విషపూరిత అంశాలకు, అతిశయోక్తి పదాలతో పాటు తప్పుడు సందేశాలకు తావుండదు. కష్టమైన పదాల కోసం అంతర్గత అర్థాలతో ఓ నిఘంటువు కూడా ఉంటుంది. దీనివల్ల రోజువారీ పదజాలంలో కొన్ని కొత్త పదాలు చేరతాయి. పిల్లలకు వార్తలు చదివే అలవాటును పెంపొందించడం ద్వారా వారు ఎక్కువ సమాచారాన్ని పొంది, పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను కనబరిచే అవకాశం ఉంటుంది. న్యూసాహుట్‌లో ప్రతిరోజు దాదాపు 4 గంటలకు ఒక కథనం పోస్ట్ అవుతుంది. ఈ సమచారం తమ చందాదారులకు WhatsApp ద్వారా అందుతుంది. న్యూస్‌హూట్ జూలై నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ప్రారంభించింది. భారీగా తగ్గింపు ప్లాన్స్ కోసం న్యూస్‌హూట్‌తో భాగస్వామి కావాలనుకునే పాఠశాలలు లేదా సంబంధిత వ్యక్తులు [email protected]లో సంప్రదించవచ్చు.

చిన్నప్పటి నుంచే నాకు వార్తలు చదివే అలవాటుంది. కానీ ఈ-తరం పిల్లలకు ఇలాంటి ఆసక్తి ఉండటం లేదు. న్యూస్‌ ద్వారా వాళ్లు ఆనందం పొందలేకపోవడమే ఇందుకు కారణమని భావించాను. ఇక కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా హింస, మతతత్వం పెచ్చుమీరి తప్పుడు వార్తలు పెరుగుతున్నాయి. దీంతో వార్తాంశాలను క్యూరియాసిటీ పెంచేలా అందించేందుకు మొదట 30మంది పిల్లలపై పైలట్ ప్రాజెక్ట్ చేపట్టి తల్లిదండ్రుల నుంచి ఫీడ్‌బ్యాక్ పొందాను. అందరూ పాజిటివ్‌గా స్పందించడంతో దీన్ని ప్రారంభించాను. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం లేదా రష్యా-ఉక్రెయిన్ వివాదం.. ఏ అంశమైనా పిల్లలకు అర్థమయ్యేలా చెబితే వారికి ప్రాపంచిక అంశాలపై అవగాహన పెరుగుతుంది.


- అన్మోల్ మల్హోత్ర

హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌కు కారణమవుతున్న సువాసనలు




Next Story

Most Viewed